Rajaji Statue:లూటెన్స్ స్థానంలో రాజాజీ-రాష్ట్రపతి భవన్‌లో విగ్రహావిష్కరణ..!!

Date:


India

oi-Kannaiah

రాష్ట్రపతి భవన్‌లో వలసవాద ఆనవాళ్లకు స్వస్తి పలుకుతూ భారతీయత ఉట్టిపడేలా సరికొత్త మార్పు చోటుచేసుకుంది. స్వతంత్ర భారతదేశానికి తొలి ఏకైక భారతీయ గవర్నర్ జనరల్,భారతరత్న చక్రవర్తి రాజగోపాలాచారి కాంస్య విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం ఆవిష్కరించారు.రాష్ట్రపతి భవన్‌లోని అశోక మండపం సమీపంలో ఉన్న గ్రాండ్ ఓపెన్ మెట్ల వద్ద బ్రిటీష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లూటెన్స్ విగ్రహం ఉన్న స్థానంలో ఇప్పుడు రాజాజీ విగ్రహాన్ని ప్రతిష్టించడం విశేషం. ఈ కార్యక్రమం కేవలం ఒక విగ్రహ మార్పు మాత్రమే కాదని, దేశం ‘మానసిక వలసవాదం’ (Mental Decolonisation) నుండి బయటపడటానికి ఒక సంకేతమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.

రాజాజీకి దక్కిన సముచిత గౌరవం

ఈ వేడుకలో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, ఎస్. జైశంకర్, ధర్మేంద్ర ప్రధాన్ తదితరులతో పాటు రాజగోపాలాచారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వందేమాతర గీతంలోని ఆరు చరణాల సంగీత విభావరి మధ్య ఈ విగ్రహావిష్కరణ అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ప్రసంగిస్తూ, రాజాజీ రాష్ట్రపతి భవన్‌లో ఉన్న కాలంలో ఇక్కడి ఆవరణలో కొంత భాగాన్ని వ్యవసాయ సాగుకు కేటాయించి స్వయం సమృద్ధికి నాంది పలికారని గుర్తుచేశారు.

1878లో మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించిన రాజాజీ, గాంధీజీకి అత్యంత సన్నిహితుడిగా, రౌలత్ చట్టం, సహాయ నిరాకరణోద్యమం వంటి పోరాటాల్లో కీలక పాత్ర పోషించారు.ఆయన నిబద్ధత,స్వతంత్ర ఆలోచనా విధానం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ తన ‘మన్ కీ బాత్’లో గతంలోనే కొనియాడారు.

ఎవరీ ఎడ్విన్ లూటెన్స్.. భారత్‌తో ఆయన అనుబంధం ఏంటి?

ఇప్పటివరకు అక్కడ విగ్రహం ఉన్న ఎడ్విన్ లూటెన్స్ గురించి తెలుసుకోవడం ఆసక్తికరం. లూటెన్స్ ఒక ప్రముఖ బ్రిటీష్ ఆర్కిటెక్ట్, 20వ శతాబ్దపు గొప్ప వాస్తుశిల్పులలో ఒకరిగా పేరుగాంచారు. 1911లో బ్రిటీష్ పాలకులు రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చాలని నిర్ణయించినప్పుడు, కొత్త నగరాన్ని డిజైన్ చేసే బాధ్యతను లూటెన్స్‌కు అప్పగించారు. అందుకే నేటికీ ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ప్రాంతాన్ని ‘లూటెన్స్ ఢిల్లీ’ అని పిలుస్తారు.

రాష్ట్రపతి భవన్ (అప్పటి వైస్రాయ్ హౌస్), ఇండియా గేట్, పార్లమెంట్ భవనం వంటి కట్టడాలకు ఆయనే ప్రధాన రూపశిల్పి. భారతీయ సంప్రదాయాలను,యూరోపియన్ క్లాసికల్ శైలిని కలిపి ఆయన ఈ కట్టడాలను నిర్మించారు.అయితే స్వతంత్ర భారతంలో కూడా మన దేశపు గొప్ప నాయకులకు కాకుండా,వలస పాలకుల ప్రతినిధులకు రాష్ట్రపతి భవన్‌లో ప్రాధాన్యత ఉండటం సరికాదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మార్పు చేపట్టింది.

బ్రిటీష్ కాలం నాటి గుర్తులను పక్కనపెట్టి,మన దేశ గౌరవానికి చిహ్నమైన రాజాజీ విగ్రహాన్ని కొలువుదీర్చడం ద్వారా భారత్ తన సొంత చరిత్రను గర్వంగా చాటుకుంది. రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా, అత్యున్నత భారతరత్న పురస్కార గ్రహీతగా రాజాజీ అందించిన సేవలు ఇప్పుడు రాష్ట్రపతి భవన్‌కు వచ్చే ప్రతి సందర్శకుడికి స్ఫూర్తినిస్తాయి. వలసవాద ఆలోచనల నుండి స్వేచ్ఛ పొందుతూ, స్వదేశీ యోధుల త్యాగాలను స్మరించుకోవడంలో ఇదొక చారిత్రక ఘట్టం.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related