Telangana
oi-Bomma Shivakumar
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కోసం సర్వం సిద్ధం అయింది. ఫిబ్రవరి 11 బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఓటింగ్ కోసం 8,203 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 2,982 వార్డుల్లో 12,930 మంది భవితవ్యం తేలనుంది.
రాష్ట్రంలో మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల ఎన్నికల పోలింగ్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 11 బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,982 వార్డుల్లో 12,930 మంది భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 22,519 మంది అభ్యర్థులు 29,742 నామినేషన్లు వేశారు. అయితే నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత 12,944 మంది మిగిలారు. అందులో రాష్ట్రవ్యాప్తంగా 9 మున్సిపాల్టీలు రెండు కార్పొరేషన్లలో 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవం కాగా.. 12 మంది కాంగ్రెస్.. ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు.
ఇక మున్సిపల్ ఎన్నికల కోసం 8,203 పోలింగ్ కేంద్రాలు 16,031 బ్యాలెట్ బాక్సులు, 137 స్ట్రాంగ్ రూమ్ లు అలాగే 136 ఓట్ల లెక్కింపు కేంద్రాల్ని రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. పటిష్టమైన భద్రత మధ్య ఎన్నికలు జరగనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.


