Andhra Pradesh
oi-Lingareddy Gajjala
అది ఒక పదో తరగతి పరీక్షా కేంద్రం. విద్యార్థులంతా తమ భవిష్యత్తు కోసం పెన్నులు పట్టుకుని సిద్ధమవుతున్నారు. కానీ, అందరి మధ్యలో ఒక విద్యార్థి మాత్రం ప్రాణవాయువు కోసం ఆక్సిజన్ మాస్క్ ధరించి, పక్కనే సిలిండర్ పెట్టుకుని కనిపిస్తున్నాడు. అతడి ఊపిరితిత్తులు మొరాయిస్తున్నా.. తన గమ్యం వైపు అడుగులు వేస్తున్న ఆ దృశ్యం చూసి అక్కడి వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నానికి చెందిన కౌశిక్ అనే విద్యార్థి సాగిస్తున్న ఈ ‘అక్షర సమరం’ ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది.
కొత్తపట్నంకు చెందిన కౌశిక్ గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సంబంధిత తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నాడు. సొంతంగా గాలి పీల్చుకోవడం కూడా అతడికి భారమైపోయింది. డాక్టర్లు పరీక్షించి ‘ఊపిరితిత్తుల మార్పిడి’ (Lung Transplant) ఒక్కటే మార్గమని తేల్చి చెప్పారు. అయితే, ఇందుకు ఏకంగా 50 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని పేర్కొన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద కుటుంబానికి అంత ఆర్థిక స్థోమత లేదు. ప్రాణం ఎప్పుడు ఏమవుతుందో తెలియని స్థితిలో ఉన్నా.. చదువుకోవాలనే ఆ విద్యార్థి ఆశ మాత్రం చావలేదు.
సిలిండర్తోనే సెంటర్కు.. మాస్క్ ధరించి మరీ!
పదో తరగతి పరీక్షలు తన జీవితానికి కీలకమని భావించిన కౌశిక్, అనారోగ్యాన్ని సాకుగా చూపి వెనకడుగు వేయలేదు. తండ్రి సాయంతో ఆక్సిజన్ సిలిండర్ను వెంట తెచ్చుకుని, ముఖానికి ఆక్సిజన్ మాస్క్ తగిలించుకుని పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతున్నా, పెన్ను పట్టుకుని ఒక్కో అక్షరాన్ని తన ఆశయంగా మార్చుకుని రాశాడు. పరీక్షా హాలులో పక్కనే ఉన్న ఆక్సిజన్ సిలిండర్.. అతడి ప్రాణానికే కాదు, చదువుపై అతడికున్న తిరుగులేని పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది.
సాయం కోసం ఎదురుచూస్తున్న ‘చిన్నారి ప్రాణం’
కౌశిక్ పట్టుదలను చూసి విద్యాశాఖ అధికారులు, స్థానికులు అభినందిస్తున్నా.. అతడిని వేధిస్తున్న అనారోగ్యం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఆ 50 లక్షల రూపాయలు సమకూరితేనే ఈ అక్షర యోధుడు పూర్తిస్థాయిలో ప్రాణాలతో బయటపడగలడు. ఆ చిన్నారి ప్రాణాన్ని కాపాడి, అతడి చదువుల కల నెరవేర్చడానికి దాతలు ముందుకు రావాలని కౌశిక్ తల్లిదండ్రులు కన్నీళ్లతో వేడుకుంటున్నారు. విద్యార్థి రాసింది కేవలం పరీక్ష మాత్రమే కాదు.. మృత్యువుపై పోరాటం చేస్తూ రాసిన విజయాక్షరమాల ఇది.


