International
oi-Bomma Shivakumar
ఇరాన్ తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో చర్చలు జరిపేందుకు ఇరాన్ తాజాగా ప్రయత్నించిందని అన్నారు. కానీ అప్పటికే చాలా సమయం మించిపోయిందని పేర్కొన్నారు. ఈ మేరకు ‘టూ లేట్’ అని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం అయిన ట్రూత్ సోషల్ లో స్పష్టం చేశారు. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతోపాటుగా ఇరాన్ నాయకత్వాన్ని పూర్తిగా నాశనం చేశామని ట్రంప్ పేర్కొన్నారు.
ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. శనివారం ప్రారంభమైన దాడుల్లో ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు క్షిపణులు, డ్రోన్ దాడులతో రెచ్చిపోయాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. దాంతో ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ తోపాటు గల్ఫ్ దేశాలపై దాడులకు పాల్పడుతోంది. యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, సైప్రస్, ఇరాక్, జోర్డాన్ తదితర దేశాలపై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక పోస్టు పెట్టారు.
ఇరాన్ తాజాగా తమతో చర్చలకు ప్రయత్నించిందని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని ఇరాన్ తో చెప్పినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో సహా ఇరాన్ నాయకత్వాన్ని పూర్తిగా నాశనం చేశామని ట్రంప్ తెలిపారు. అలాగే ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్, నేవీని కూడా నాశనం చేశామని అన్నారు. ఈ మేరకు ఇరాన్ తో జరిగిన యుద్ధంపై తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ లో పేర్కొన్నారు ట్రంప్.
ఇక ఇరాన్ పై దాడులను ట్రంప్ సమర్ధించుకున్నారు. ఇరాన్.. తమపై వేగంగా దాడులకు పాల్పడుతోందని.. ఇది అమెరికాకు తీవ్ర ముప్పుగా తాము భావిస్తున్నట్లు తెలిపారు. ఐరోపా దేశాలను, ఇతర దేశాల్లోని అమెరికా స్థావరాలను ధ్వంసం చేయగలిగిన బాలిస్టిక్ క్షిపణులు ఇరాన్ వద్ద ఇప్పటికే ఉన్నాయని ట్రంప్ అన్నారు. ఇలాంటి సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులు, అణ్వాయుధాలు కలిగిన ఇరాన్ తో మిడిల్ ఈస్ట్ మాత్రమే కాకుండా అమెరికాకు కూడా పెను ముప్పు అని అందుకే ఇరాన్ పై దాడులు చేసినట్టు ట్రంప్ సమర్థించుకున్నారు. ఇకపై ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ది చేయకుండా ఉండేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు ట్రంప్ వివరించారు.
మరోవైపు ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సైన్యం దాడులు తీవ్రతరం అవుతున్నాయి.ఖమేనీ కుటుంబంతో పాటు దాదాపు ఇరాన్ ప్రభుత్వంలోని అధికారులంతా హతం అయ్యారు.మార్చి 3 మంగళవారం నాటికి 787 మంది ఇరాన్ లో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఇరాన్ స్టేట్ మీడియా స్పష్టం చేసింది. యుద్ధం తీవ్రతరం అవుతున్న క్రమంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.


