Andhra Pradesh
oi-Sai Chaitanya
Tirumala: TTD మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి సేవకుల తరహాలోనే వైద్య విభాగంలో సేవలు అందించేందుకు శ్రీవారి వైద్య సేవకులుగా ఆసక్తి ఉన్న వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు వారికి దరఖాస్తు విధానం పైన స్పష్టత ఇస్తూ.. వారి సేవల పైన క్లారిటీ ఇచ్చింది. ఇక.. శ్రీవారి వైద్య సేవకులుగా ముందుకు వచ్చిన వారికి ప్రత్యేకంగా వారి కుటుంబ సభ్యులతో సహా శ్రీవారి ప్రోటోకాల్ దర్శనంతో పాటుగా వసతి.. ప్రయాణం ఉచితం గా కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించారు.
టీటీడీ శ్రీవారి వైద్య సేవకులుగా ముందుకు వచ్చే వారి కోసం కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఆసుపత్రుల్లో శ్రీవారి వైద్య సేవకుల ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు సిద్దమైంది. కాగా, ఇప్పటికే కొందరు సేవలు టీటీడీ ఆహ్వానం మేరకు ముందుకు వచ్చారు. వైద్యులతో పాటుగా వైద్య రంగంలో వివిధ విభాగాల్లో పని చేసే వారికి టీటీడీ శ్రీవారి వైద్య సేవకులుగా అవకాశం కల్పిస్తోంది. టీటీడీ పరిధిలోని ఆస్పత్రుల్లో పని చేస్తూ రోగులకు అవసరమైన విధంగా అధునాతన శస్త్ర చికిత్సలు, బోధన, పరిశోధనలపై అధ్యయనం నిమిత్తం వారికి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ఇలా ముందుకు వచ్చిన వారికి వారితో పాటు కుటుంబ సభ్యులకు శ్రీవారి ప్రొటోకాల్ దర్శనం, వసతి, రవాణా తదితర సదుపాయాలు సమకూరుస్తున్నారు. ఇలా ముందుకు వచ్చేందుకు ఆసక్తి ఉన్న శ్రీవారి వైద్య సేవకులు ముందుగా టీటీడీ వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి త్వరలోనే యాప్ సైతం అందుబాటులోకి తేనుంది. ఆసక్తి ఉన్న వారు నెలలో కనీసం వారం రోజుల పాటు సేవ కోసం సమయం కేటాయించాలి.
టీటీడీ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలే లక్ష్యంగా
వీరి కోసం స్విమ్స్ లో ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేసారు. వారికి కావాల్సిన సమాచారం కోసం ఫోన్ నంబరు 91542 16307, [email protected]లో సంప్రదించాలని సూచిస్తున్నారు. వైద్య సేవలు అందించేవారికి టీటీడీ అనేక ప్రయోజనాలు కల్పిస్తోంది. వేదిక్ వర్సిటీ, స్విమ్స్ ఆస్పత్రి ప్రాంగణాల్లో వసతి, భోజనం సౌకర్యం కల్పిస్తోంది. ఇక రవాణా ఖర్చులో కూడా భరిస్తున్నారు. వీరి కోసం భూదేవి కాంప్లెక్స్లో ప్రత్యేక ఆఫీస్ కేటాయించారు. ఈ ఆఫీస్ నుంచి కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకు చెందిన ప్రముఖ డాక్టర్లు కూడా ఒక వారం పాటు వచ్చి ఈ విధానంలో సేవలు అందిస్తున్నారు. ఇటీవల స్విమ్స్, బర్డ్ ఆస్పత్రులను అంతర్జాతీయ వైద్య బృందం పర్యవేక్షించింది. సర్జరీలు, ఆపరేషన్ థియేటర్ల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేసింది. ఆ సూచన ప్రకారం ఇప్పుడు ఈ రెండు ఆస్పత్రుల్లో పలు మార్పులు చేస్తున్నారు. భక్తులతో పాటు స్థానిక ప్రజలకు వీరి ద్వారా వైద్య సేవలు అందించేలా కార్యాచరణ కొనసాగుతోంది.


