International
oi-Kannaiah
US-Israel Strike Iran : ప్రపంచం మరో పెను యుద్ధం ముంగిట నిలబడిందా? మధ్య ప్రాచ్యం (Middle East) అగ్నిగుండంగా మారుతోందా? శనివారం తెల్లవారుజామున జరిగిన పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇన్నాళ్లూ షాడో వార్ లేదా నిశబ్ధ యుద్ధం చేసిన ఇజ్రాయెల్,అమెరికా..ఇప్పుడు నేరుగా ఇరాన్ గడ్డపై విరుచుకుపడ్డాయి.టెహ్రాన్ నగరం బాంబుల మోతతో దద్దరిల్లిపోయింది. ఆకాశమంతా దట్టమైన పొగ కమ్మేసింది.అయితే,ఈ దాడుల కంటే సంచలనమైన వార్త మరొకటి ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తోంది.
ఇరాన్ రక్షణ మంత్రి అంతం?
స్థానిక ఇరాన్ మీడియా కథనాల ప్రకారం.. అమెరికా,ఇజ్రాయెల్ జరిపిన మొదటి విడత వైమానిక దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి,మేజర్ జనరల్ అమీర్ హతామీ మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. 1966లో జన్మించిన హతామీ,కేవలం 14 ఏళ్ల వయసులోనే వాలంటీర్గా సైన్యంలో చేరి,ఇరాన్-ఇరాక్ యుద్ధంలో పాల్గొన్న సుదీర్ఘ అనుభవం ఉన్న యోధుడు.2025 జూన్లోనే ఆయనను అగ్రనేత అలీ ఖమేనీ ఆర్మీ కమాండర్-ఇన్-చీఫ్గా నియమించారు.అయితే,ఆయన మరణవార్తను ఇరాన్ ప్రభుత్వం గానీ,ఇజ్రాయెల్ సైన్యం గానీ అధికారికంగా ధృవీకరించలేదు.ఒకవేళ ఇదే నిజమైతే,ఇరాన్ సైనిక శక్తికి ఇది కోలుకోలేని దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు.
రంగంలోకి ట్రంప్.. “మేజర్ ఆపరేషన్” షురూ!
ఇజ్రాయెల్ దాడుల ప్రారంభమైన కాసేపటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా రంగంలోకి దిగారు.ఇరాన్పై అమెరికా “మేజర్ కాంబాట్ ఆపరేషన్స్”ప్రారంభించిందని ఆయన స్వయంగా ప్రకటించడం సంచలనం సృష్టించింది.”అమెరికా ప్రజలను రక్షించుకోవడమే మా లక్ష్యం.ఇరాన్ క్షిపణి వ్యవస్థను,నౌకాదళ సామర్థ్యాన్ని తుత్తునియలు చేస్తాం”అని ట్రంప్ హెచ్చరించారు. ఇటు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ కూడా స్పందిస్తూ..తమ దేశానికి పొంచి ఉన్న ముప్పును తొలగించడానికే ఈ ముందస్తు దాడులు చేశామని స్పష్టం చేశారు.
ప్రతిదాడికి దిగిన ఇరాన్.. వణుకుతున్న టెల్ అవీవ్
అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ మిన్నకుండిపోలేదు.దాడులు జరిగిన కొద్ది గంటల్లోనే ఇరాన్ నుంచి 50 నుంచి 70 బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్పైకి దూసుకొచ్చాయి.దీంతో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లో ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించారు.సైరన్ల మోతతో ప్రజలు ప్రాణభయంతో షెల్టర్లలోకి పరుగులు తీశారు.ఇరుపక్షాల మధ్య భీకర దాడులు కొనసాగుతుండటంతో అసలు ఎంతమంది మరణించారు?ఎంత ఆస్తి నష్టం జరిగింది?అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
మొత్తానికి అగ్రరాజ్యం అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగడంతో పరిస్థితి అత్యంత భయానకంగా మారింది.ఇరాన్ రక్షణ మంత్రి మరణంపై నెలకొన్న ఉత్కంఠ,మరోవైపు క్షిపణుల వర్షం..ఇవన్నీ చూస్తుంటే మూడవ ప్రపంచ యుద్ధానికి ఇక్కడే పునాది పడుతోందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.ఇరాన్ తదుపరి అడుగు ఏంటి?అమెరికా ప్లాన్ ఏంటి?ఈ ఉత్కంఠకు తెరపడాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.


