International
oi-Bomma Shivakumar
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఒకదానిపై మరొకటి క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. అయితే ఇరాన్ పై జరిపిన దాడుల్లో సుప్రీ లీడర్ ఖమేనీ మృతి చెందారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా ధృవీకరించింది. అంతేకాక ఈ దాడుల్లో ఖమేనీ కుమార్తె, మనవడు, కోడలు, అల్లుడు మరణించినట్లు వెల్లడించింది. అయితే ప్రతీకార దాడులను ఇరాన్ ముమ్మరం చేస్తోంది. ఈ మేరకు అమెరికాకు చెందిన యుద్ధ నౌక USS అబ్రహం లింకన్ పై క్షిపణులతో దాడి చేసినట్లు ఇరాన్ పేర్కొంది. USS అబ్రహం లింకన్ పై 4 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్లు ఇరాన్ సైనిక విభాగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఈ ప్రకటన చేసింది.
🚫Iran’s IRGC claims to have struck USS Abraham Lincoln with ballistic missiles. LIE.
✅The Lincoln was not hit. The missiles launched didn’t even come close. The Lincoln continues to launch aircraft in support of CENTCOM’s relentless campaign to defend the American people by… pic.twitter.com/AjaeHMemtA— U.S. Central Command (@CENTCOM) March 1, 2026
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేపట్టిన నేపథ్యంలో అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులను చేస్తోంది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 ను ప్రారంభించింది. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, బహ్రైయిన్ తదితర దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేపడుతోంది. డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో భాగంగా అమెరికాకు చెందిన యుద్ధనౌక USS అబ్రహం లింకన్ పై 4 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్లు ఇరాన్ పేర్కొంది. తాము ప్రయోగించిన 4 క్షిపణులు లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకున్నాయని ఇరాన్ పేర్కొంటోంది.
అయితే ఇరాన్ ప్రకటనను అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ఖండించింది. ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. లింకన్ నౌకపై ఎలాంటి దాడి జరగలేదని పేర్కొంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు నౌకకు కనీసం దరిదాపుల్లోకి కూడా రాలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం USS అబ్రహం లింకన్, స్ట్రైక్ గ్రూప్ సురక్షితంగా ఉన్నాయని తెలిపింది. అలాగే తమ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తున్నాయని అమెరికా పేర్కొంది.


