India
oi-Bomma Shivakumar
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ టీవీకే పార్టీ సన్నద్ధం అవుతోంది. విజయ్ ఆధ్వర్యంలో టీవీకే పార్టీ తొలిసారిగా బరిలోకి దిగుతోంది. మరోవైపు అధికారాన్ని కాపాడుకునే పనిలో డీఎంకే పార్టీ కసరత్తులు చేస్తోంది. ఇక అన్నాడీఎంకే- బీజేపీ కూటమి సైతం ఈసారి అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారనున్నాయి.
ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగుతున్న దళపతి విజయ్ తన శక్తియుక్తులను కూడగట్టుకుంటున్నారు. ఈ మేరకు వరుసగా బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వెల్లూరులో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో విజయ్ పాల్గొన్నారు. డీఎంకే కూటమి, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమిపై నిప్పులు చెరిగారు.
తమిళనాడు ఎన్నికల పోరులో అసలు పోరు డీఎంకే, టీవీకే పార్టీ మధ్యే.. మిగతావన్నీ కేవలం కామెడీ మాత్రమేనని విజయ్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పై తీవ్ర విమర్శలు చేశారు. స్టాలిన్ అసలైన స్నేహితులు లంచం, అవినీతి, స్వార్థ రాజకీయాలేనని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
తమిళనాడులో నిజమైన అభివృద్ధిని చూసింది.. కామరాజ్, అన్నాదురై, ఎంజీఆర్ లాంటి మహానేతల కాలంలోనేనని విజయ్ అన్నారు. ప్రభుత్వం చెప్పుకుంటున్న అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని స్పష్టంచేశారు. ఈ మేరకు డీఎంకే ప్రభుత్వాన్ని ఉల్టా మోడల్ గవర్నమెంట్, స్టాండ్ అప్ కామెడీ సర్కార్ అని విజయ్ ఎద్దేవా చేశారు. ఇక టీవీకే పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు వెళ్లి ప్రజలను స్వయంగా కలుస్తానని విజయ్ హామీ ఇచ్చారు. ప్రతి పౌరుడి సమస్యకు పరిష్కారం చూపుతానని అన్నారు.
మరోవైపు టీవీకే అధ్యక్షుడు విజయ్.. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న తరుణంలో ఉత్తర చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పార్టీ నేతలు కోరుతున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 22న జరిగిన టీవీకే పార్టీ క్యాడర్ మీటింగ్ లో నేతలు, కార్యకర్తలు ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. పేదరికం అధికంగా ఉన్న ప్రాంతం నుంచి పార్టీ అధికార యంత్రాంగం పోటీ చేయాలని పార్టీ తీర్మానించిందని పార్టీ సెక్రట్రరీ ఆధవ్ ఇటీవల పేర్కొన్నారు. నార్త్ చెన్నై ప్రాంతంలో ఈ సమస్య అధికంగా ఉందని.. అందువల్ల పార్టీ అధినేత విజయ్.. ఈ ప్రాంతంలోని పెరంబూర్, కోలత్తూర్, ఆర్కే నగర్ లో ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఇదే విషయంపై విజయ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


